14 May, 2026 | 12:17 AM

Breaking News

సిద్దరామయ్యకు ఊరట

19-02-2025 10:53 PM

ముడా కేసులో లోకాయుక్త క్లీన్‌చిట్..

బెంగళూరు: ముడా కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిన లోకాయుక్త ఆయనతో పాటు తన భార్య పార్వతికి క్లీన్‌చిట్ ఇచ్చింది. మూడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య, అతని భార్య, ఇతర కుటుంబసభ్యుల ప్రమేయం ఉందంటూ తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తమ నివేదికలో లోకాయుక్త పోలీసులు తెలిపారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. తమ నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. 

ఏమిటీ ముడా కుంభకోణం..?

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో విలువైన భూముల్ని సిద్దరామయ్య తన భార్య పార్వతి సహా ఇతర కుటుంబసభ్యులకు కట్టబెట్టారంటూ టీజే అబ్రహం, ఎస్సీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ విచారణకు ఆదేశించారు. కేసు విచారణ చేపట్టిన లోకాయుక్త తాజాగా సిద్దరామయ్యకు సంబంధించిన కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలపడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.