30-05-2025 10:25:27 PM
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పట్టణ మత పెద్దలతో శాంతి సంఘం సమావేశం
సోషల్ మీడియాలో మత ఘర్షణలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండగ పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే సామరస్య పరిష్కారానికి పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని అన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతి భద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉంటుందని కాబట్టి వివిధ వర్గాల మత పెద్దలు యువతకు సమన్వయం పాటించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు.