30-05-2025 10:30:13 PM
బెల్లంపల్లి ఆర్డిఓకు రైతుల విన్నపం
బెల్లంపల్లి అర్బన్, మే 30(విజయ క్రాంతి): వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపిన అధికారులపై చర్య తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రైతులతో కలిసి బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివారులోనీ సర్వే నెంబర్ 65, 67 లో సాగు చేస్తున్నారని అన్నారు.
గత సంవత్సరం నుండి అటవీశాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు చెందినవని రైతులపై దాడులు చేస్తూ, అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని ఆరోపించారు. అటవీశాఖ అధికారుల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు రైతుల భూముల్లో రావద్దని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు అటవీశాఖ అధికారులపై కేసు నమోదు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కేశవ రెడ్డి, రైతులు బానయ్యా, లింగయ్య, సతీష్ , రాజయ్య, పర్వతాలు బాధిత రైతులు పాల్గొన్నారు.