02-11-2025 06:48:27 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హనుమకొండ గోపాల్ పూర్ ఊర చెరువులోనికి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు చేరడంతో చెరువుకట్ట తెగిపోయి కింద ఉన్న కాలనీలు నీట మునగగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు సాగునీటి పారుదల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. మరమ్మతు పనులు అన్ని ఆదివారంతో పూర్తయ్యాయి. అక్టోబర్ 29వ తేదీన తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షంతో ఎగువ ప్రాంతాల నుండి గోపాల్ పూర్ ఊర చెరువు సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో చెరువు కట్ట తెగింది.
దీంతో వివేక్ నగర్, అమరావతి నగర్, సమ్మయ్య నగర్, ఇతర కాలనీలు ముంపునకు గురయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాగునీటిపారుదల శాఖ అధికారులు తెగిన చెరువు కట్టను మట్టి, ఇసుక బస్తాలతో పూడ్చి వరద నీరు దిగువ ప్రాంతానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఆదివారం సాగునీటి పారుదల శాఖ అధికారులు ఊర చెరువు కట్టకి సంబంధించి పూర్తిస్థాయి మరమ్మతులు చేయించారు. చెరువు కట్ట మరమ్మత్తు, పునరుద్ధరణ చర్యలను సాగునీటి పారుదల శాఖ అధికారులు డిఈఈ కిరణ్ కుమార్, డిఈ హర్షవర్ధన్, ఏఈ నజ్మా ఖానం క్షేత్రస్థాయిలో పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షించారు.