21-06-2025 11:07:30 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు(MLA Dr. Tellam Venkata Rao)కు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతపత్రం అందజేయడం జరిగింది. భద్రాచలం పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం గత 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థలో ఉండి, ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నదని ఎమ్మెల్యేకి వివరించడం జరిగింది.
అదేవిధంగా అంబేద్కర్ నూతన విగ్రహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గతో మాట్లాడి ప్రభుత్వ నిధులతోనే అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కి విన్నవించడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఉన్న బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు స్పందిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని గౌరవిస్తూ ప్రభుత్వ నిధులతోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, బైండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మరియు సీనియర్ అడ్వకేట్ పడిసిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.