ప్రజా సమస్యలను పరిష్కరించండి
జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి, జూన్ 10 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలను పరిష్కరించాలని, పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకుల తో కలిసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త ఐఏఎస్, బోడుప్పల్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ ఏ.శైలజ లకు వినతి పత్రం అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా పర్యటనలో భాగంగా పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపురం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలను సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని తెలిపారు.
పారిశుద్ధ్య లోపాలు దోమల బెడద, అంతర్గత కాలనీల్లో క్రమం తప్పకుండా రోడ్లు ఊడ్చకపోవడం, వీధుల మూలల్లో చెత్త పేరుకుపోవడం వల్ల వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తమ హయాంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్లు, మంచినీటి పైప్లైన్లు, నల్లా కనెక్షన్లు వంటి అనేక మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించామని గుర్తుచేశారు.
ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్య సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజారోగ్యం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జోనల్ కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి,బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి,మైనారిటి అధ్యక్షులు జిలాని పాషా,ఆకుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.






