చెరువుల పునరుద్ధరణ ముఖ్యం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12(విజయక్రాంతి): చెరువుల అభివృద్ధి అంటే కేవలం వాటికి రంగులు వేసి, బండ్ల ను అందంగా అలంకరించడం మాత్రమే కాదని, వాటి అసలు ఉద్దేశం నెరవేరేలా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సకల జీవరాశులకు ప్రాణాధారంగా, నగరానికి వరద ముప్పును నివారించే సహజ వ్యవస్థలుగా చెరువులను తీర్చిదిద్దినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బుధవారం శిల్పకళావేదికలో నిర్వహించిన‘సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్’ లో హైడ్రా కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ సీఎస్ఆర్ నిధుల కింద చెరువులను అభివృద్ధి చేస్తున్న సంస్థలకు కీలక సూచనలు చేశారు. చెరువుల్లో పేరుకుపోయిన పూడికను, ఆక్రమణలను, చుట్టూ పోసిన మట్టిని పూర్తిగా తొలగించి, వాటి సహజ విస్తీర్ణాన్ని, లోతును పునరుద్ధరించాలన్నారు.
మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు తీసు కున్నాకే, సుందరీకరణ, ఇతర ఆకర్షణలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సీఎస్ఆర్ నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగ మయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గొలుసుకట్టు చెరువుల కు ప్రాణాధారమైన నాలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.




