04-08-2025 12:32:34 AM
-20 నెలలు గడిచినా సీఎం రేవంత్ పెన్షన్లు పెంచడం లేదు
-ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ అడగడం లేదు
-సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
గజ్వేల్, ఆగస్టు 3: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచకుండా వృద్ధులు, వికలాంగులను మోసం చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి కూడా కేసీఆర్ మౌనం వహిస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. గజ్వేల్ శోభ గార్డెన్ లో వికలాంగుల వృద్ధుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తూ ఎవరికి వారు ఉన్నారన్నారు. కెసిఆర్ సీఎంగా ఉన్ననాటి నాటి నుండే పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పేదల గురించి కెసిఆర్ అడగడం లేదని ఇప్పటికైనా మౌనం వీడాలన్నారు.
ప్రతిపక్ష నాయకుడి పాత్రలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇద్దరు పెన్షన్ పై ఆధారపడ్డ వారిని దారుణంగా మోసం చేస్తున్నారని దేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కెసిఆర్ లు దేశంలో నెంబర్ వన్ మోసగాళ్ళన్నారు. 20 నెలల నుండి ఒక్కో పెన్షన్ వృద్ధ, వికలాంగ వితంతు, ఒంటరి మహిళలు రూ.40,000 చొప్పున రాష్ట్రంలో 20వేల కోట్లు నష్టపోయారన్నారు. పెన్షన్లు చెల్లించాల్సిన డబ్బుతో డబ్బులు ఉన్న వాళ్లకు రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనోడ్ని కొట్టి ఉన్నవారికి పెడుతుందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరూ పేదోళ్లు కాదని అందుకే పెన్షన్ పై ఆధారపడి జీవించే పేదవారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. 2007 నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రారంభించి పేదల కోసం పోరాడానని, ఆ ఫలితంగానే ప్రస్తుతం ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి పింఛన్లు ఇవ్వకుండా 20 నెలలు మోసం చేస్తే, కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని మోసం చేస్తున్నారని వీరికి ఓటేయొద్దని పిలుపునిచ్చారు.
పింఛన్ పెంచుతావా లేక రాజీనామా చేస్తావా తేల్చుకోవాలని సభాముఖంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పెన్షన్ల పెంపు సాధన కోసమే ఆగస్టు 13న హైదరాబాదులో భారీ సభను నిర్వహిస్తున్నారని సభకు వృద్ధుల వికలాంగులు పెన్షన్ దారులంతా రావాలన్నారు.
కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కామల్ల భూమయ్య, ఎం ఎస్ పి జాతీయ నాయకులు మంద కుమార్, జిల్లా కొ ఇంచార్జ్ మల్లిగారి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మొక్కపల్లి రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మొక్కపల్లి రాజు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, టిజిడిజే ఏ సి బాబు, దుర్గయ్య పాల్గొన్నారు.