03-06-2025 01:03:58 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): భూ భారతి చట్టం అమలు కోసం మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గతంలో పైలట్ మండలాల్లో రెవె న్యూ సదస్సులు నిర్వహించామని, ఇప్పుడు మిగిలిన అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నా రు.
గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం వెళ్లి, ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి, మానవీయ కోణంలో పరిష్కరిస్తారని చెప్పారు. రెవెన్యూ సదస్సులపై సోమవారం హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
రాష్ర్టంలో గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం రెవెన్యూ వ్యవస్ధను దుర్వినియోగపరచిందని ఆరోపించారు. జరిగిన తప్పులను సరిచేసి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామని, మొదటి దశలో ఏప్రిల్ 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించామని చెప్పారు.
గత నెల 5నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ర్ట వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంతవరకు ప్రతీ గ్రామంలో అధికారులు భూ సమస్యలను, ఆగస్టు 15 నాటికి పరిష్కరించనున్నట్లు చెప్పారు.
ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు వారి ప్రమేయం లేకుండానే భూ సమస్యల్లో చిక్కుకున్నారని అన్నారు. నేడు ప్రభుత్వమే వారి వద్దకు వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.
పైలెట్ మండలాల్లో విజయవంతం
4 పైలెట్ మండలాల పరిధిలోని 72 గ్రామాల్లో నిర్వహించిన మొదటి విడత రెవెన్యూ సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు, రెండో విడతలో 28 మండలాల్లో 421 గ్రామాలల్లో 42 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి ఇప్పటి వరకు 60 శాతం వరకు భూ సమస్యలు పరిష్కరించామని వెల్లడించారు.
అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నదని, దీనికి త్వరలో పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ముఖ్యంగా కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
త్వరలో గ్రామ పరిపాలన అధికారులు
భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలన అధికారులను (జీపీవో) అతి త్వరలో నియామక పత్రాలను అందజేసి మండలాల్లో నియమించబోతున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. గ్రామ పాలన అధికారులు 10,954 పోస్టుల భర్తీకి జీవో విడుదల చేయగా 5 వేలకు పైగా దరఖాస్తులు అందాయని, ఇందులో మే 25 తేదీన నిర్వహించిన పరీక్షకు 4,588 మంది అభ్యర్థులు హాజరు కాగా తుది మెరిట్ జాబితాలో 3,550 మంది ఎంపిక అయ్యారని తెలిపారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఇందుకు సర్వే సెటిల్ మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. మొదటి దశలో ఆరు వేల మంది సర్వేయర్లను రెండు నెలల్లో నియమించబోతున్నామని వెల్లడించారు.