03-06-2025 01:04:57 AM
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ
ఎల్బీనగర్, జూన్ 2 : అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారలేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం లేదని, పాలనలో మంత్రులకు స్వేచ్ఛ లేదని, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని విమర్శించారు.
సరూర్ నగర్ డివిజన్ లోని ఎస్ ఆర్ గార్డెన్ లో ఇస్కప్ (ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో ఆపరేటివ్ అండ్ ఫ్రెండ్ షిప్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన... ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.
హైదరాబాద్ లో అనేక మంది పేదలు సొంత ఇల్లు లేకుండా గుడిసెల్లో ఉంటున్నారని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదని, కేవలం నాయకులు బాగుపడ్డారన్నారు. కార్యక్రమంలో ఇస్కప్ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్, సీపీఐ నాయకులు భిక్షపతి గౌడ్, విశ్వశర్మ, కవిత, ఫాతిమా, నందనవనం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.