04-05-2025 10:34:18 PM
క్రీడా ప్రాంగణంకు కేటాయించిన స్థలం కబ్జా..
రెండు అక్రమ నిర్మాణాలను కూల్చేసిన తాండ యువకులు..
అవినీతి మత్తులో పడిన అధికారులంటూ ఆరోపణలు..
విధి నిర్వహణలో విఫలమయ్యారంటూ యువకుల మండిపాటు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలంలో రెవెన్యూ అధికారులకు తాండ యువకులు షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం యువత కోసం కేటాయించిన క్రీడా ప్రాంగణం కబ్జాలకు వేదిక అయ్యిందని అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు అవినీతికి అమ్ముడుపోయి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రెవెన్యూ గిరిదావర్ కబ్జాదారుల వైపు వత్తాసు పలుకుతుండడంతో తండా యువకులు ఏకమయ్యి,తండాలో క్రీడా ప్రాంగణం స్థలం లో అక్రమంగా నిర్మిస్తున్న రెండు అక్రమ నిర్మాణ గదులను యువకులంతా కలిసి కూల్చి వేశారు.
నెల నెల లక్షల రూపాయలు వేతనాలు అందుకుంటున్న మండల ఎమ్మార్వో, సిబ్బంది అక్రమ నిర్మాణాల అడ్డుకోవడంలో విఫలమయ్యారని యువకులు మండిపడ్డారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు కనుమరుగవుతుండడంతో తామే ఈ పని చేశామని యువకులు కరాకండిగా చెప్తున్నారు. తండా యువకుల చైతన్యం ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయొచ్చని పలువురు అభినందించారు. ఇప్పటికైనా దుండిగల్ మండలంలో రెవెన్యూ అధికారులు తమ నెల నెల పొందుతున్న వేతనానికి న్యాయం చేసి ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కాకుండా తండా యువకులను ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్మాణాలను కూల్చితే పోలీసులకు ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణదారుడు
దుండిగల్ మండలం తండా-2 లో ప్రభుత్వ సర్వే నంబర్ 684లో స్థానిక నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి క్రీడా ప్రాంగణం ప్రభుత్వం స్థలం కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు తెరలేపాడు. తనకు పాత ఇంటి నెంబర్లు ఉన్నాయని ఆ నంబర్ల ఆధారంగానే నిర్మాణాలను చేపడుతున్నానని ఎక్కడివో నెంబర్ లు ఇక్కడ చూపిస్తూ మేక పోతు గంభీర్యం ప్రదర్శిస్తూ తన పలుకుబడి ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన యూత్ యువకులపై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు రావడంతో తండా యువకులు మేమేం ఏమి తప్పు చేశాము, గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం మంజూరు చేసిందని ఇప్పుడు అది కబ్జా అవుతుందని అధికారులకు తెలిపామన్నారు.
అయినా వారు కబ్జాలపై చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు చేయవలసిన పని మేం చేసాము అంటూ పోలీసులకు సైతం స్పష్టంగా వివరణ ఇచ్చారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు కబ్జాదారుడుపై చర్యలు తీసుకుంటారా..? లేక తూతూ మంత్రపు చర్యలు చేపట్టి మమ అనిపిస్తారా..? మంచి పని చేసిన యువకుల మీద కేసులు పెడుతామని, బెదిరిస్తున్నారని యువకులు తెలిపారు. ఒకవేళ యువకుల మీద కేసులు నమోదు చేస్తే సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ తో పాటు, సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు న్యాయ పోరాటం చేస్తామని యువకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.