17-06-2025 12:00:00 AM
చారకొండ జడ్పిహెచ్ఎస్ పాఠశాల పరిశీలన
చారకొండ, జూన్ 16 : ప్రభుత్వ విద్య బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డా. చారకొండ వెంకటేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యా కమిషన్ సిఫారసు మేరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో అన్ని వసతులతో కూడిన పాఠశాలలను నిర్మించడానికి పైలెట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి, రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల గ్రామాలలోని ఒక్కో పాఠశాలకు రూ. 12 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు.
విద్యా వ్యవస్థలు విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందాన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి భయంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని కోరారు. తాను చదువుకున్న చారకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లి చారకొండకు రెండో విడతలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్ఎం భగవాన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్, కాంగ్రెస్ నా యకుడు శివ, ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి, కమలాకర్, తదితరులుపాల్గొన్నారు.