21-06-2025 12:28:13 AM
మహబూబాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తుండడంతో గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యంలో, పంపిణీ చేసిన తర్వాత మిగిలిన దొడ్డు బియ్యం నిలువలు రేషన్ షాపులు, గోదాముల్లో పేరుకు పోయాయి. దీనితో దొడ్డు బియ్యం రేషన్ డీలర్లు, ఎం ఎల్ ఎస్ పాయింట్ గోదాము నిర్వాహకులకు గుదిబండగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పథకం ప్రారంభించింది. మార్చి నెల వరకు దొడ్డు బియ్యం సరఫరా జరుగుతుండగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో లబ్ధిదారులు తీసుకోకుండా వదిలేయడంతో 1,000 క్వింటాళ్ల దొడ్డు బియ్యం రేషన్ షాపులు, గోదాముల్లో పేరుకుపోయాయి. ఇదేవిధంగా జనగామ జిల్లాలో 860, హనుమకొండలో 1,600, వరంగల్ లో 2,000, ములుగులో 3,511, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4,550 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిలువలు పేరుకుపోయాయి.
ప్రస్తుతం పూర్తిగా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో దొడ్డు బియ్యం నిల్వలు పక్కకు పడేశారు. రేషన్ షాపుల్లో ఉన్న కొద్దిపాటి స్థలంలో ఒక్కొక్క డీలర్ వద్ద కనీసం 10 నుండి 30 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం స్టాకు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ గోదాముల్లో కూడా దొడ్డు బియ్యం నిలువలు ఉన్నాయి.
దొడ్డు బియ్యం వెనక్కి తీసుకునే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ బియ్యం ఏం చేయాలో తెలియక నిరుపయోగంగా వదిలేశారు. దీనితో దొడ్డు బియ్యం రక్షణ రేషన్ డీలర్లకు తలనొప్పిగా మారింది. చిన్న గదులను అద్దెకు తీసుకొని రేషన్ బియ్యం షాపులు నిర్వహిస్తుండగా, దొడ్డు బియ్యం నిలువలు కొంత స్థలం ఆక్రమించడం, ప్రస్తుతం మూడు నెలల సన్న బియ్యం స్టాక్ ఒకే సారి రావడంతో రేషన్ డీలర్లు స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే మరికొన్ని చోట్ల దొడ్డు బియ్యానికి పురుగులు పట్టడం, పందికొక్కులు, ఎలుకలు తింటుండడంతో వాటిని రక్షించడం కష్టంగా మారింది. నిలువ ఉన్న పాత దొడ్డు బియ్యం వల్ల కొత్తగా వచ్చిన సన్నబియ్యం పంపిణీకి ఇబ్బందులు కలగడంతో పాటు పురుగులు, ఎలుకల బారిన పడకుండా కాపాడడం తమకు తలకు మించిన భారంగా మారిందని డీలర్లు వాపోతున్నారు. గోదాములు, రేషన్ షాపుల్లో నిలువ ఉన్న దొడ్డు బియ్యం వ్యవహారంపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని, గోదాములు, రేషన్ షాపుల్లో నుండి దొడ్డు బియ్యం క్లియరెన్స్ చేయించాలని కోరుతున్నారు.
త్వరగా నిర్ణయం తీసుకోవాలి
రేషన్ షాపుల్లో గత మార్చి నెల వరకు పంపిణీ చేయకుండా మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిలువల తొలగింపు పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఎలుకలు, పందికొక్కులు, పురుగుల వల్ల దొడ్డు బియ్యం తరుగు ఏర్పడుతోంది. క్లోసింగ్ స్టాక్ లెక్క ప్రకారం తర్వాత మమ్మల్ని ఆ లెక్కన బియ్యం ఇవ్వమని అడిగితే నష్టపోవాల్సి వస్తుంది. మూడు నెలల స్టాకు సన్న బియ్యం వస్తుండడంతో దొడ్డు బియ్యం నిల్వతో ఇబ్బందిగా మారుతున్నాయి.
ఇప్పటికే ఫలితాలు దృష్టికి తీసుకు వెళ్ళాం. అధికారులు రోడ్డు బియ్యం వ్యవహారంపై మాకు ప్రభుత్వం నుండి ఏలాంటి సమాచారం లేదని సమాధానం ఇస్తున్నారు. రోజు రోజుకు దొడ్డు బియ్యం వ్యవహారం మాకు గుడిబండగా మారింది. ప్రభుత్వం వెంటనే నిలువ ఉన్న దొడ్డు బియ్యం వ్యవహారంపై చర్యలు తీసుకొని దొడ్డు బియ్యం భారాన్ని తొలగించాలి.
గొర్రె వెంకన్న,
రేషన్ డీలర్ల సంఘం,
మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షుడు