19-06-2025 02:54:18 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది మిషన్ భగీరథ పథకం. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మిషన్ భగీరథ ద్వారా పట్టణాలు, పల్లెల్లోని ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ప్రజలకు తాగునీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంది. అయితే గ్రామాల్లో కొత్తగా పైప్ లైన్లు వేయకుండా పాత పైపులైన్లకే మెయిన్ భగీరథ పైప్లైన్లను అనుసంధానం చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో చాలా చోట్ల పట్టణాలు, గ్రామాలు, పల్లెల్లో పైప్లైన్లు రోడ్ల వెంట, కొన్ని చోట్ల రోడ్డ కింద ఉండిపోయాయి. ఇప్పుడు పలుచోట్ల పైప్ లైన్లకు మరమ్మతులు చేయాల్సి రావడంతో రోడ్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం కేసముద్రం బల్దియాలో ప్రధాన రహదారి కింద ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ మూసుకుపోయి కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
దీనితో పైప్లైన్ మరమ్మత్తు కోసం ఆర్ అండ్ బి శాఖ ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సిమెంట్ రోడ్డు ను మున్సిపల్ సిబ్బంది కంప్రెసర్ యంత్రంతో పగలగొట్టిస్తున్నారు. కేసముద్రం పట్టణంలోని ప్రధాన రహదారి కావడంతో ఇటీవల లక్షల రూపాయల ఖర్చుతో పొట్టి శ్రీరాముల సర్కిల్ నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు సిమెంట్ రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై ఇరుకుగా ఉన్న చోట తాజాగా మిషన్ భగీరథ పైపు లైన్ మరమ్మతు కోసం సిమెంట్ రోడ్డు పగలగొట్టడంతో, రోడ్డు దెబ్బతిని ప్రధాన రహదారిపై మళ్ళీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడనుంది.