calender_icon.png 19 June, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయస్ఫూర్తి చూపిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌

19-06-2025 02:59:12 PM

శ్యామల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రవీందర్

సిద్దిపేట,(విజయక్రాంతి): కుటుంబ కలహాలతో నిండు ప్రాణాలను అర్ధాంతరంగా ముగించేందుకు నిర్ణయించుకున్న మహిళను సిద్దిపేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ అప్రమత్తంగా వ్యవహరించి రక్షించటం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల ప్రాంతంలో నివాసం ఉంటున్న చిట్టాపురం శ్యామల (30), భర్త నాగరాజుతో తలెత్తిన కుటుంబ సమస్యలతో విసిగిపోయి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఇంటినుంచి బయటకు బయలుదేరింది.

ఆమె సిద్దిపేట పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో తారసపడి అటూ ఇటూ తిరుగుతూ కనిపించగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ గమనించి తక్షణమే స్పందించారు. ప్రశాంతంగా ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకొని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంది  అంటూ ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆమె భర్త ఫోన్ నంబర్ ఇవ్వమని అడగగా, నేను వెళ్ళను అని తేల్చి చెప్పిన ఆమెను రవీందర్ వెంటనే సఖి సెంటర్‌కు సమాచారం ఇచ్చి వారిని అక్కడికి పిలిపించారు. అనంతరం శ్యామలను సురక్షితంగా సఖి సెంటర్ సిబ్బందికి అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్ రవీందర్ చూపిన మానవీయత, సమయస్ఫూర్తి వల్ల ఒక కుటుంబం ప్రాణాలు దక్కించుకుంది. ఈ ఘటన స్థానికంగా ప్రశంసల పాలవుతోంది.