05-06-2025 06:24:41 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి..
వనపర్తి టౌన్: వనపర్తి పట్టణం నుండి వెళ్లే పాన్గల్ పెబ్బేర్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి(District Collector Adarsh Surabhi) మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్లో రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. పానగల్ రోడ్డుకు సంబంధించి మొత్తము ఎంత మంది స్థలాలు కోల్పోతున్నారు, వారికి ఇప్పటి వరకు అందజేసిన సహకారంపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.
పానగల్ రోడ్డు విస్తరణకు సంబంధించి 63 మంది స్థలాలు కొంత వరకు కోల్పోతున్నారని అందులో ఇప్పటికే 22 మందికి రెండు పడకల ఇళ్లు కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ వివరించారు. కొత్తగా మరో 18 మంది డబుల్ బెడ్ రూమ్ అడుగుచున్నారని, 24 మంది ప్లాట్ అడుగుచున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇందులో 8 మందికి పూర్తిగా స్థలం కోల్పోతున్న వారు ఉన్నట్లు తెలిపారు. స్పందించిన కలెక్టర్ కొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, లేదా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, మిగిలిన వారికి టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వడం జరుగుతోందన్నారు.
పెబ్బేరు రోడ్డుపై మాట్లాడుతూ... 80 ఫీట్ల రోడ్డుకు కొలతలు తీసుకోవాలని, స్థలం కోల్పోతున్న వారికి టి.డి.ఆర్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండవ దఫా నోటీసులు జారి చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎ. ఈ పావని, ఇతర మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.