పనిచేసే షాప్లోనే కన్నం
- దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
నిందితులు అరెస్టు
ఇబ్రహీంపట్నం, జూన్ 5 (విజయక్రాంతి): ఇబ్రహీం పట్నం లోని ఓ కిరాణ షాప్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నం మంచాల రోడ్డు మార్గంలో ఉన్న బాలాజీ కిరాణ షాప్లో ఈ నెల 1న దొంగతనం జరిగింది. కిరాణా షాప్లో సేల్స్బాయ్స్గా పనిచేస్తున్న ముగ్గురు అదే షాప్పై కన్నేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తికి చెందిన పవన్, దండుమైలారం గ్రామానికి చెందిన వినయ్లు బాలాజీ కిరాణ షాప్లో సేల్స్బాయ్స్గా పనిచేస్తున్నారు.
వీరికి వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ కలిసి షాప్లో దొంగతనం చేయాలని ప్రణాళిక రచించారు. అనుకున్నట్లుగానే, ఈనెల 1వ తేదీ అర్థరాత్రి సమయంలో షాప్ వెనుక డోర్ పగలగొట్టి లోపల ఉన్న లాకర్ తెరిచి రూ. 3,16,000 నగదు, 10 గ్రాముల బంగారం దొంగతనం చేసి వ్యాన్లో అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు కిరాణా షాప్ యజమాని వచ్చి చూడగా నగదు, బంగారం కనిపించలేదు. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం లో వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద నుండి నగదు, బంగారం స్వాధీనం చేసుకుని బుధవారం కోర్టులో హా జరుపర్చారు. ఈ కేసును చేదించిన ఎస్ఐ మారయ్య, పోలీసు సిబ్బందిని ఏసీపీ రాజు అభినందించి వారికి రివార్డును అందజేశారు.






