బురఖాలో వచ్చి బంగారం దుకాణంలో చోరీ
మేడ్చల్: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ పీఎస్ సమీపంలో గురువారం ఇద్దరు దుండగులు దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. వారిలో ఒకరు బురఖా ధరించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన దుకాణ యజమాని శేషారంపై కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. మేడ్చల్లోని కొంపల్లిలో ఉన్న జగదాంబ జ్యువెలర్స్లోకి ఇద్దరు దుండగులు ఉదయం 11 గంటల సమయంలో ప్రవేశించారు.
అందులో ఓ వ్యక్తి కత్తి తీసి విలువైన వస్తువులను తనకు అప్పగించాలని షాపు యజమానిని బెదిరించాడు. షాప్లో కూర్చున్న ఓ సేల్స్మెన్ భయపడి నగలు తయారు చేసే గదిలోకి పరిగెత్తాడు. దుండగుడు కత్తితో అతని భుజంపై దాడి చేసినప్పటికీ యజమాని బయటకు పరుగులు తీసి కేకలు వేయడంతో దుండగులు భయాందోళనకు గురై ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఈ దోపిడీ ప్రయత్నమంతా షాపులో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో రికార్డైంది. యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీని ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.






