30-06-2025 12:57:25 AM
న్యూఢిల్లీ, జూన్ 29: రష్యా ఉక్రెయిన్పై డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. శనివారం రాత్రి మొత్తం 447 డ్రోన్లు, 60 మిస్సైల్స్ను ప్రయోగించగా.. అందులో 249 కూల్చేశామని మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయినట్టు ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. యుద్ధం మొదలైన నుంచి ఇదే అతిపెద్ద గగనతల దాడి అని ఉక్రెయిన్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు.
ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ మాట్లాడుతూ.. ‘శనివారం రాత్రి అతిపెద్ద దాడి జరిగింది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించింది.’ అని పేర్కొన్నారు. ఖెర్సాన్ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్టు అక్కడి గవర్నర్ తెలిపారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన ఎఫ్ యుద్ధవిమానం కూలిపోయి అందులోని పైలట్ ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ మిలటరీ పేర్కొంది.
40 డ్రోన్లు కూల్చేశాం: రష్యా రక్షణ శాఖ
ఉక్రెయిన్ ప్రయోగించిన 40 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ దేశాలు రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు.
పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇస్తాంబుల్లో మరోవిడత శాంతిచర్చలు జరిపేందుకు మాస్కో సిద్ధంగా ఉంది. నేటికీ మాస్కోలో పేలుళ్లు జరుగుతున్నాయి. నాటో విస్తరణ, ఉక్రెయిన్తో వివాదాన్ని పరిష్కరించడం వంటి హామీలిచ్చి వాటిని నిలబెట్టుకోకుండా పశ్చిమ దేశాలు రష్యాను పదేపదే మోసం చేస్తున్నాయి.’ అని వ్యాఖ్యానించారు.