22-10-2025 01:51:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ‘పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా, విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాల ను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయరు.. అలాంటి ధీరులకు సలాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర కీలకమైం దని తెలిపారు. ఎక్కడైతే శాంతి నెలకొంటుందో అక్కడే అభివృద్ధి సాధ్యమవు తుందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టం లో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతో కూడిన అంశమని, ఈ విషయంలో తమ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ పోలీసు శాఖ అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉం టుందని భరోసా ఇచ్చారు. మంగళవారం గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా... విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’న“పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టు నాయకులు, సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ర్టంలో విస్తృతంగా జరిగేవని, కానీ పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొందని పేర్కొన్నారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసని, మిగిలిన వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారని, ఈ సంవ త్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ర్టంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని తెలిపారు. గ్రేహౌండ్స్ కమాండోలు టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారని పేర్కొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బి.సైదులు విధి నిర్వహణలో మరణించారని, మూడు రోజు ల కింద నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వ హణలో వీర మరణం చెందరాని తెలిపారు.
దేశంలోనే అగ్రస్థానంలో..
తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ర్ట పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ప్రభుత్వానికి గర్వకారణమని సీఎం తెలిపారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీ స్ శాఖకు ప్రథమ స్థానం లభించిందని, అదేవిధంగా, పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానం లోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని వెల్లడించారు. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్న ట్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనకు ‘ఈగల్’ వింగ్
తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తి గా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ర్టంగా మార్చాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని, ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చామన్నారు. డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశామన్నారు. ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫిం గ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయని చెప్పారు.
సాంకేతిక త వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వ కారణమన్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ విభా గం అత్యంత సమర్థంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్ గా నిలిచిందని, సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్ రాష్ర్ట ఆపరేష న్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందన్నారు.
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత
ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టిందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసిందని, రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించామని తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించామన్నారు.
విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నామన్నారు. మెడికల్ సీట్ల లోనూ పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నామని తెలిపారు.
తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలు, ఎస్సు, సీఐలకు కోటి 25 లక్షలు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షలు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు.
వారి రుణం తీర్చుకోలేనిది
ప్రజల ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదని సీఎం అన్నారు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా పోలీసుల పిల్లల కు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరు ల పిల్లలకు కేటాయించామన్నారు. ఒలింపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను పెంచినట్లు చెప్పారు.
పోలీసు శాఖపై నమ్మకం మరింత పెంచాలి
పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసింగ్కు మూల స్తంభాలని, ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు ఆ శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసులు తమ విధి నిర్వహణలో వీటిని పాటించడానికి ప్రయత్నించాలని, ప్రజా సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మకం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలని సీఎం సూచించారు.
సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం
కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కో ల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, అమరుడైన కాని స్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షే మం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పారు. 2018లో ఒడిశాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయిం చామని తెలిపారు.
మహిళా అధికారులకు కీలక పోస్టింగ్లు
పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ పోలీ సు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ల సారధ్యం వహించడం తమ ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే ఉన్నారని, రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికా రులను చూసి తెలంగాణ గర్విస్తోందని చెప్పారు.