3 March, 2026 | 3:21 AM

ఖేలో ఇండియా ఆర్చరీలో సముద్రాల అఖిల్‌కి స్వర్ణం

03-03-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చరీ క్రీడాకారులు సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. పుదుచ్చేరి వేదికగా ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు జరిగిన ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2026లో అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

రెండోసారి ఛాంపియన్గా అఖిల్  ఈ విజయం అఖిల్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2024లో ఇప్పటికే ఈ ఛాంపియన్షిప్ గెలుచుకున్న అఖిల్, ఇప్పుడు 2026లో కూడా స్వర్ణం సాధించి రెండోసారి టైటిల్ను నిలబెట్టుకోవడం విశేషం. దక్షిణ భారతదేశంలోని ఉద్ధండులైన ఆర్చర్లను వెనక్కి నెట్టి ఆయన సాధించిన ఈ ‘ఫ్యాబులస్ విక్టరీ’పై క్రీడా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

అఖిల్ సాధించిన ఈ ఘన విజయం పట్ల మహబూబాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సముద్రాల అఖిల్ సాధించిన ఈ విజయం మన జిల్లాకే గర్వకారణమని, వరుసగా రెండోసారి జాతీయ స్థాయి సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించడం సామాన్యమైన విషయం కాదని, అఖిల్ పట్టుదల, కఠోర శ్రమకు ఈ పతకమే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.