ఆటోడ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం
భిక్కనూర్, మార్చి 2 (విజయ క్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచనల మేరకు ఆరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఆటో డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
డాక్టర్ బాలు నాయక్ (కంటి వైద్య నిపుణులు, కామారెడ్డి) సహకారంతో సుమారు 100 మంది ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్, భిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు, బిబిపెట్ ఎస్ఐ విజయ్, రాజంపేట ఎస్ ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




