7 April, 2026 | 3:54 PM

ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి

07-04-2026 02:16 PM

* ఇసుక రవాణకు పకడ్బందీ చర్యలు

* ఆన్లైన్ లేకుండా ఇసుక తరలిస్తే  చర్యలు తప్పవు

* నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట ఏప్రిల్ 07: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఇసుక రీచ్ ల నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మాత్రమే మన ఇసుక మన వాహనం ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలని, అందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లోని మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇసుక తవ్వకం, తరలింపు విధానాలను పరిశీలించి, అక్కడి అధికారులతో పాటు ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుకను తరలిస్తున్నదీ స్పష్టంగా నమోదు కావాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళలో తాను సీసీ కెమెరాల్లో రికార్డు పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు.  ఆన్లైన్ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. అధికారులే నియమాలు ఉల్లంఘించినా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీ జరిగితే పారదర్శకత పెరిగి, అక్రమాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్ ల నుంచి ఇసుక అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఇసుక మన వాహనం ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలని స్పష్టం చేశారు.

“మన ఇసుక – మన వాహనం” పోర్టల్‌లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణా అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించిన కలెక్టర్, ప్రతి దశలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.  జిల్లా కలెక్టర్ వెంట ఉప్పునుంతల, వంగూరు మండలాల రెవిన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు తదితరులు  ఉన్నారు.