14-05-2025 01:10:51 AM
సీఎస్ రమకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్కుమార్ సుల్తానియాను నియమించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ కే రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
ఈ సందర్భంగా సుల్తానియా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సుల్తానియాకు డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు తెలిపారు. 1998 బ్యాచ్కు చెందిన సందీప్కుమార్ సుల్తానియా బిహార్ రాష్ట్రానికి చెందినవారు. చార్టర్డ్ అకౌంటెంట్ గ్రా డ్యుయేట్. తొలుత తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
అనంతరం సీఎం కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్థిక, రవాణా, సహకార సంస్థలు, పర్యాటక రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, భూ రెవెన్యూ నిర్వహణ, పట్టణాభివృద్ధిలో అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన తాజాగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.