13-12-2025 01:23:39 AM
మహేశ్బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’తో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. పురాణాల నేపథ్యంతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్పై రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్ పాత్ర మునుపెన్నడూ కనిపించని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా గతంలో మహేశ్బాబుతో దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఓ సినిమా రూపొందించాలని అనుకున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..
ఈ కాంబినేషన్లో ఇప్పుడు సినిమా రావడం ఖాయం కానుందని తెలుస్తోంది. ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సందీప్రెడ్డి వంగా, మహేశ్ కోసం గతంలో చెప్పిన కథను మళ్లీ తీసుకొచ్చినట్టు సమాచారం. మహేశ్, ఆయన భార్య నమ్రత కలిసి ఆ కథ గురించి పూర్తిగా చర్చించారట. మహేశ్ ఇమేజ్కి ఇది బాగా సరిపోతుందని భావించినట్టు తెలుస్తోంది. దీంతో సందీప్ను పిలిపించి సినిమా చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారనేది ప్రస్తుతం సినీసర్కిళ్లలో వినవస్తున్న టాక్. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.