కొలువుదీరిన పంచాయితీ పాలకవర్గాలు
- ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు
- ఘనంగా సత్కరించిన నాయకులు, గ్రామ పెద్దలు
- ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తామన్న నూతన పాలకమండలి
- గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం.
విజయక్రాంతి,పాపన్నపేట: గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు ఇక విముక్తి కలిగింది. ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేసారు. ముందుగా నాయకులు, గ్రామస్తులతో కలిసి గ్రామ పంచాయితీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
అనంతరం శాలువాలతో సత్కరించుకున్నారు. సుమారు రెండు సంవత్సరాల తర్వాత పల్లెలకు ప్రత్యేక అధికారుల పాలనతో విముక్తి లభించింది. గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నికలు జరిగే వరకు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రవేశపెట్టింది. జిల్లాలో మూడు విడుతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కొంగొత్త పాలనకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. కొత్త పంచాయతీలు కొలువుదీరిన అనంతరం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో మొదటి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళ్లేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






