నేటి నుంచి బడి గంట
పాఠశాలలు పునఃప్రారంభం
వేసవి సెలవులకు ముగింపు
సర్కారీ స్కూళ్లలో మెరుగైన వసతులు
నేడే పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): సుదీర్ఘ వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. దాదా పు 50 రోజుల తరువాత మళ్లీ బడిగంట మోగనుంది. మంగళవారంతో సెలవులు ముగిశాయి. దీంతో ఇన్నాళ్లు సెలవులను ఆస్వాదించిన విద్యార్థులంతా బడిబాట పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పా ట్లు పూర్తిచేసింది.
రాష్ట్రంలో అన్నిరకాల యాజమాన్యాలు కలిపి 38 వేల పాఠశాలున్నాయి. వీటిల్లో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ౨౬ వేలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ బుధవారమే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు అందజేయనున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాటశాల కమిటీలు వేసింది. ఈ కమిటీలు స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించటంతోపాటు గ్రామాల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఈ కమిటీలు ప్రోత్సహిస్తున్నాయి.
తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యంతోపాటు మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. స్వయం సహాయక బృందాల సభ్యులతో కుట్టించిన యూనిఫాంలతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అన్ని స్కూళ్లకు చేరాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఏటా విద్యాసంవత్సరం మధ్య లో జరిగే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను ఈసారి ప్రారంభంలోనే మొదలుపెట్టారు.






