31 May, 2026 | 6:26 PM

అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!

31-05-2026 05:42 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ అప్పులు చేసి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేశారని, రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రైతుబంధు లేదు.. రాహుల్ బంధు నడుస్తోందని కేటీఆర్  విమర్శించారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగ అని కేవలం 3 గంటల కరెంట్ చాలంటూ ఈ రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కిండని ఆయన ఎద్దేవా చేశారు. నేడు తానేదో కొత్తగా ఉద్ధరిస్తున్నట్లు 24 గంటల కరెంట్ కోసం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేస్తున్నానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడు. అది రైతు మెడకు ఉరి పెట్టే డిస్కమని కేటీఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో 6,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలు చెప్పి రెండేండ్లు గడిచిపోయాయి. ఇప్పటివరకు ఆరు ఇండ్లు కూడా కట్టలేదని, కనీసం ఆరు ఇటుకపెళ్లలు కూడా పెట్టలేదన్నారు. 

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రంలోని చీకట్లను, పవర్ హాలిడేలను రూపుమాపి ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో... రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ అంతే ఉంటదని దుయ్యాబట్టారు. యూరియా ఇచ్చే తెలివి లేదు, సాగునీరు ఇచ్చే చేతకాదు, కనీసం వడ్లు కొనే దిక్కు లేదని ఆయన ఎగతాళి చేశారు. ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వమా 'రైతు డిస్కం' పెట్టేది?, అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం' అని కేటీఆర్ అన్నారు.