సీఐఎస్ఎఫ్ చేతిలోకి పార్లమెంటు భద్రత
రంగంలోకి 3,300 మంది సిబ్బంది
న్యూఢిల్లీ, మే 19: పార్లమెంటు సమగ్ర భద్రతను ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) చేతుల్లోకి తీసుకోనుంది. సీఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందిన 3,300 మంది సిబ్బంది ఇవాళ్టి నుంచి విధుల్లో చేరనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పార్లమెంటు భద్రతను సీఆర్పీఎఫ్కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించేవి.
అయితే గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో భద్రతా వైఫల్యం సంఘటన తీవ్ర కలకలం రేపింది. పార్లమెంట్ భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. దీంతో పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తాత్కాలికంగా వారికి బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తారు.






