24 June, 2026 | 1:43 AM

ప్రకాష్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

24-06-2026 12:34 AM

ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం

ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డుల కేసులో సంచలనం

బెంగళూరు ఏసీజేఎం కోర్టు సంచలన నిర్ణయం 

బెంగళూరు, జూన్ ౨౩: ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌కు బెంగళూరు 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు షాక్‌నిచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారని, ఎన్నికల నిబంధనలను సైతం ఉల్లంఘించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణలో న్యాయస్థానం మంగళవారం ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ప్రకాశ్‌రాజ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని ౨౦౧౯లో న్యాయవాది దిలీప్‌కుమార్ బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పిటిషనర్ సిటీ పోలీస్ కమిషనర్‌ను, తర్వాత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో చివరకు ఆయన కోర్టు తలుపుతట్టారు.

ఏసీజేఎం కోర్టును ఆశ్రయించగా, అప్పటి నుంచి విచారణ జరుగుతున్నది. ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ, ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరు కాలేదు. తమ ఆదేశాలను పదే పదే బేఖాతరు చేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈసారి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ప్రకాష్‌రాజ్ తరఫు తన న్యాయవాదులు స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.