హిమాచల్లో ఘోరప్రమాదం.. కారు లోయలో పడి ఏడుగురు మృతి
చంబా: హిమాచల్ ప్రదేశ్లోని(Himachal Pradesh) చంబా జిల్లాలో ఒక SUV వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ఏడుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మస్రుండ్-హమాల్ మార్గంలో(Masrund-Hamal Route) ఛత్రుండ్ సమీపంలో మహీంద్రా బొలెరో(Mahindra Bolero) వాహన డ్రైవర్ అదుపు తప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం, ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురూ అక్కడికక్కడే మరణించారు.
మృతులలో డ్రైవర్తో పాటు ఆరుగురు ప్రయాణికులు, ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు. బాధితులు ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత, పోలీసులు, జిల్లా యంత్రాంగం అధికారులు, స్థానిక ప్రజలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోయ నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ దినేష్ శర్మ మాట్లాడుతూ, "ఉదయం ప్రమాదం గురించి సమాచారం అందగానే, స్థానికుల సహకారంతో పోలీసు బృందం వెంటనే స్పందించింది. మృతదేహాలన్నింటినీ వెలికితీశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు సహా మొత్తం ఏడుగురు మరణించారు; వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని తెలిపారు.






