calender_icon.png 23 August, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ విషయంలో మాట నిలబెట్టుకున్నాం

27-11-2024 03:31:44 PM

రంగారెడ్డి,(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు రుణ మాఫీ విషయంలో ఇచ్చినా హామీని నిలబెట్టుకున్నమని, దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. త్వరలోనే పాలమూరు జిల్లాల్లో జరిగే రైతు పండుగను పురస్కరించుకొని వివిధ కారణాల చేత రుణమాఫీ అందని రైతాంగానికి రూ.3,000 కోట్లను పంపిణీ చేయబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  హాజరయ్యారు.

మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తో పాటు మార్కెట్ డైరెక్టర్లు మంత్రి తుమ్మల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భం గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... గత ప్రభుత్వం పదేళ్లలో రూ .7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ, మరోవైపు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఎక్కడ లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ .47 వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కిందని ఆయన కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.... రంగారెడ్డి జిల్లాలో కోహెడ వద్ద రూ.1000 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ ఎంతో ప్రయోజనా పథకంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో రూ .25 వేల కోట్లు వచ్చాయని ఇందులో రైతులకు సంబంధించి 7600 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని మంత్రి అన్నారు.

రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, ఇతర కారణాలతో ఆగిపోయిన రైతు రుణమాఫీలకు సంబంధించి త్వరలో పాలమూరులో జరగనున్న రైతు పండుగ కార్యక్రమం ద్వారా రూ.3000 కోట్లను మిగిలిన రైతాంగానికి రుణమాఫీ ద్వారా చెల్లించడం జరుగుతుందని అన్నారు. వరి దిగుబడి రాష్ట్రంలో ఆశాజనకంగా ఉందని అన్నారు. 66 లక్షల ఎకరాల సేద్యం తెలంగాణలో జరిగిందని, ఇందులో 46 నుండి 50 లక్షల ఎకరాల మేరకు పంట రైతుల చేతికి వచ్చిందని, మిగిలిన ధాన్యం కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని అన్నారు. 153 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉందని ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని రైతులకు మంచి బోనస్ కూడా ఇస్తుందని అన్నారు. తెలంగాణ బియ్యానికి విదేశాలు మంచి మార్కెట్ ఉందని, మలేషియా, పిలిపిన్స్ దేశాల్లో తెలంగాణ బియ్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారని దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ నుండి ముఖ్యమంత్రిగా గెలుపొందాక పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకునేందుకు అవసరమైతే బడ్జెట్లో డబ్బులు ఎక్కువ నిధులు పెట్టిన సరే తమకు ఏమీ అభ్యంతరం లేదని ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోమని క్యాబినెట్ సమావేశంలో సూచించినట్టు తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే విధంగా సీఎం  ఎంతో పట్టుదలతో ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం గా పాలమూరు జిల్లా ప్రగతికి కచ్చితంగా పాటుపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ శాఖ చూసిన అవినీతి అక్రమమయమైందని వాపోయారు. అవినీతికి ఆలవానంగా నిలిచిందని అన్నారు.

త్రిబుల్ ఆర్ వస్తే షాద్ నగర్ భూమి బంగారమే: మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

రూరల్ రీజినల్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ వస్తే షాద్ నగర్ నియోజకవర్గంలో భూములు బంగారం అవుతాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు అత్యంత చేరువలో ఉన్న షాద్ నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ వస్తే ఎవరు ఊహించని రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా ఇక్కడ భూమిని బంగారం ధరలను పోల్చుకునే విధంగా ఉంటుందని అన్నారు.