10-12-2025 01:32:03 AM
నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం రోజున ఆమెకు ఓ కేసు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందు 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరిందన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది.
వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సెప్టెంబర్ 11న కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ త్రిపాఠి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు విన్న కోర్టు విచారణకు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు.