గ్యాస్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నకిలీ లింకులు, ఫేక్ ఆఫర్లపై జాగ్రత్త
ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్
మునుగోడు,(విజయక్రాంతి): వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను కొందరు సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వినియోగదారులను అప్రమత్తం చేశారు. గురువారం ఆయన “విజయ క్రాంతి”తో మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులనే లక్ష్యంగా చేసుకొని కొత్త తరహా మోసాలకు తెరతీసే అవకాశం ఉందన్నారు.
తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు ఇస్తామని చెప్పుతూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ కొందరు ప్రజలను మోసం చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గుర్తించాలని రఘునందన్ స్పష్టం చేశారు.




