21-01-2026 12:15:16 AM
ఏరోజుకారోజు రికార్డులు బద్దలు
న్యూఢిల్లీ, జనవరి 20: వెండి ధరకు రెక్కలొచ్చి సామాన్యుడికి అందకుండా ఆకాశానికి ఎగబాకుతున్నది. రోజురోజుకు ధర పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం కిలో వెండి ధర ఏకంగా రూ.3,40,000 పలికింది. సోమవారం రూ.3,18,000 పలికిన ధర, 24 గంటల వ్యవధిలోనే రూ.22,000 మేర పెరగడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఇలాగే కొనసాగితే మున్ముందు కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ.1,48,370 పలికింది. సోమవారం ఈ ధర రూ.1,45,690 పలుకగా, ౨౪ గంటల వ్యవధిలో రూ.2,680 మేర పెరిగింది.
అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, భౌగోళిక అనిశ్చితి కారణంగానే దేశీయంగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పెరుగుదలకు కారణం.