26-05-2025 01:31:24 AM
గజ్వేల్, మే 25: ప్రజల మానప్రాణాలను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన పహల్గాం దుర్ఘటనకు ప్రతీకారంగా చేసిన ఆపరేషన్ సింధూర్ తో ప్రతి భారతీయుణ్ణి భారత సైనికులు గర్వపడేలా చేశారని గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి పట్టణ నాయకులు నాయిని సందీప్ లు అన్నారు. ఆదివారం బిజెపి నాయకులు నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు, 128వ బూత్ లో సత్యసాయి మందిరంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్ 122వ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని, మన సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయన్నారు.
దేశ ప్రజలను ఇది ఎంతగానో ప్రభావితం చేసిందని, అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నారన్నారు యుద్ధం సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సిందూర్ అని నామకరణం చేశారని, సింధూర్ తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్నారు. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం,దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని వారన్నారు . ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, కుడిక్యాల రాములు,వెంకట్ రెడ్డి, నత్తి శివకుమార్, నరసింహ ముదిరాజ్, మైసా విజయ్,కుంకుమ రాణి, భక్తమాల, స్వరాజ లక్మీ,అగుళ్ల రమేష్,129 బూత్ అధ్యక్షులు రాజేశ్వర్, రోహిత్ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.