29-06-2025 12:58:26 AM
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): సింగరేణి చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాట్ల సన్నాహాలను మరింత వేగవంతం చేయాలని, కాల పరిమితిని విధించుకొని సత్వరమే ప్రాజెక్టులను చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.
సింగరేణి కాలరీస్ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టనున్న సోలార్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, ఇతర పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లపై శనివారం ప్రజా భవన్లో భట్టి సమీక్ష నిర్వహించారు.
సింగరేణి ఎల్ఎండీపై నిర్మించనున్న 300 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, మల్లన్నసాగర్పై తలపెట్టిన 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లకు ఇరిగేషన్ శాఖ ద్వారా రావాల్సిన అనుమతులకు లేఖలు రాయాలని ఆదేశాలు ఇచ్చారు. 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లకు డీపీఆర్లను వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. రామగుండం 1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ నీటి సంపు ఆధారంగా తలపెట్టిన 500 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.
రాజస్థాన్ విద్యుత్ ఉత్పా దన్ నిగం లిమిటెడ్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఆ రాష్ర్టంలోని సోలార్ వ్యాలీలో త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఇంధన శాఖ కు సంబంధించిన అన్ని విభాగాల పనితీరును, చేపడు తున్న ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా డాష్ బోర్డును రూపొందించాలని, పథకాల అమలులో వేగం పెంచాలని ఆదేశించారు.
సింగరేణి సీఎండీ బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థ చేపట్టనున్న సోలార్, ఫ్లోటింగ్ సోలార్, పునరుత్పాదక ప్రాజెక్టులకు సంబంధించి వివరించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, తెలంగాణ రెడ్కో వైస్ చైైర్మన్, ఎండీ ఆనీలా, సింగరేణి ఈడీ (కోల్ మూమెంట్) ఎస్డీఎం సుభాని, ఈడీ (ఎస్టీపీపీ) చిరంజీవులు, జీఎంలు జానకీ రామ్, శ్రీనివాసులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.