24-12-2025 01:55:42 AM
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): సింగరేణి బలం కేవలం ఉత్పత్తిలో కాదని.. తరతరాల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతో పనిచేస్తున్న కార్మికులేనని ఇన్ఛార్జ్ సీఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. 137 సంవత్సరాలుగా ఈ సంస్థ దృఢంగా నిలబడటం వెనక వీరి కృషి ఉందని పేర్కొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన ప్రాధాన్యాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను మరింత మెరుగుపరచడం, పని పరిస్థితులను మరింత సురక్షితంగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్ మార్పులు ఉన్నప్పటికీ భద్రత ప్రమాణాలను పాటిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు సాగినట్లు గుర్తుచేశారు.
ఉత్పత్తి సామర్థ్యం, సంస్థ స్థిరత్వం, భవిష్యత్ అవకాశాల కోసం మన అనుభవం, సామర్థ్యంతో రాణించే ఇతర రంగాలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, కీలక ఖనిజాలు, అనుబంధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని మనం పరిశీలించడం ప్రారంభించామన్నారు. అలాగే ఇంధన రంగంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో సింగరేణి ఏ పాత్ర పోషించగలదో అన్న దానిపై కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
సింగరేణిలో మహిళాశక్తి పెరుగుతున్న తీరు, గనుల్లో, ఆపరేషన్లలో, రక్షణ బృందాల్లో మహిళల భాగస్వామ్యం సింగరేణి పరిణతికి గొప్ప సూచికగా అభివర్ణించారు. రెస్క్యూ జట్లు, గనుల నిర్వహణకు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపులతో స్ఫూర్తి పొందుతూ మన పనితీరును మరింతగా మెరుగు పరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగెన్, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.