దేవుళ్లపై ఒట్లు కాదు.. హామీలు నెరవేర్చాలి
కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదు
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు
వనపర్తి, మే 5 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి అదృష్టం కలిసి వచ్చి రాష్ట్రానికి సీఎం అయ్యారని.. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే దేవుళ్ల మీద ఒట్లు వేయడం కాకుండా వాటిని అమలు చేసి చూపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడు తూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ సాధించిన కేసీఆర్ను విమర్శించడం అంటే తెలంగాణ ప్రజలందరిని అవమానించినట్టేనన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో చంద్రబాబు నాయుడుకు వంత పాడిన తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా పెట్టుకుని పార్టీలు మారిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రంలో మోదీ, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో విధానపరమైన విమర్శ లు చేస్తే తప్పు లేదని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాస్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




