ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీ నుండి ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తో కలిసి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు.
ఎస్ఐఆర్ ఫారముల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణిత గడువులోగా, పకడ్బందీగా చేపట్టాలన్నారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి ఈ వీసీ లో కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. వీసీ అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ఫారములను ఓటర్ల నుంచి గడువులోగా తిరిగి తీసుకుని, డిజిటలైజేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రక్రియను మొత్తం పారదర్శకంగా చేయాలని తెలిపారు. ఈ వీసీ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






