11 May, 2026 | 9:42 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

11-05-2026 08:39 PM

గద్వాల,(విజయక్రాంతి): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పటివరకు 74.82 శాతం పూర్తయిందని, వంద శాతం పూర్తయ్యేలా ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల మ్యాపింగ్ పురోగతి ఆశించిన స్థాయిలో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలు మాత్రమే 90 శాతం పురోగతి సాధించాయని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో అన్ని జిల్లాలు వేగంగా పని చేసి 90 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 10–15 రోజులలో రెండు లక్షలకు పైగా మ్యాపింగ్ నమోదు కావడాన్ని అభినందించిన సీఈఓ, ఇతర జిల్లాలు కూడా అదే స్థాయిలో పురోగతి సాధించాలని సూచించారు. ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఒక ప్రాంతానికి చెందిన ఓటరును మరో ప్రాంతంలో మ్యాప్ చేసిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇటువంటి పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అనధికార వ్యక్తులు, రాజకీయ ప్రతినిధులు నేరుగా మ్యాపింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని, కేవలం ఇళ్ల గుర్తింపు లేదా సమాచారపరంగా మాత్రమే సహకరించాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు మ్యాపింగ్ పురోగతి, పంపిణీ చేసిన ఫారాలు, సేకరించిన ఫారాల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండేలా వీఆర్వోలు, బీఎల్ఓల పేర్లు, ఫోన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకతతో పని చేయాలన్నారు.ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో గద్వాల మండలం వెనుకబడిందని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు పరిష్కరించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో మన జిల్లా రాష్ట్రంలోనే ముందుండేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు మంజుల, సురేష్ తదితరులు పాల్గొన్నారు.