నూతన విద్యుత్ సబ్స్టేషన్ స్థల పరిశీలన
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని గంభీరావుపేట మండల పరిధిలోని భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో నూతనంగా మంజూరైన విద్యుత్ ఉపకేంద్రం సబ్స్టేషన్ నిర్మాణానికి అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. సిరిసిల్ల డివిజనల్ ఇంజనీర్ (డి.ఈ) ఎన్. అంజయ్య నేతృత్వంలో ఏడీఈ శ్రీనివాస్, ఏఈ ఆనంద్, గంభీరావుపేట డైరెక్టర్ జి. నారాయణరావు, సర్పంచ్ మహేష్ మరియు ఉపసర్పంచ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డి.ఈ అంజయ్య మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ లోడ్కు అనుగుణంగా, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల భీముని మల్లారెడ్డిపేటతో పాటు శ్రీ గాద, రామానుజపూర్ గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తొలగిపోతాయని, నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ ద్వారా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.




