29-09-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 28 : అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం తిప్పర్తి లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల బాకీ కార్డును ఇంటింటికి తిరిగి పంచారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ..రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఒక వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఎన్నికల్లో గెలవడం కోసం అలవిగాని 420 హామీలు ఇచ్చారని అన్నారు.100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు ఇచ్చి మరి కొందరైతే బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని మండిపడ్డారు. 100 రోజులు కాదు.. 700 రోజులు అయినా కూడా ఆరు గ్యారంటీలకు అతీగతీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన విషయాన్ని ఎండగట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలను.. ముఖ్యంగా రైతులను, మహిళలను, యువతను కాంగ్రెస్ ఎలా వంచించిందో, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఈ 22 నెలల కాలంలో రేవంత్ సర్కార్ ఒక్కొకరికి ఎంత బకాయి ఉందో మేము ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇస్తాం.. గెలిచాక కాడ ఎత్తేస్తాం అంటే కుదరదన్నారు.
కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, మండల నాయకులు కందుల లక్ష్మయ్య, నల్లగొండ మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య, నల్లగొండ, తిప్పర్తి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బడుపుల శంకర్, నాగేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బాకీ కార్డు పంపిణీ
చివ్వెంల, సెప్టెంబర్ 28 : ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాటిని గాలికొదిలిందనీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో ఆయన ఆదివారం ’కాంగ్రెస్ బాకీ కార్డు’ ను ప్రజల చేతికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఆశలను వమ్ము చేశారన్నారు.
ఈ బాకీ కార్డు ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేర మోసం చేసిందో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రౌతు నరసింహారావు, మాజీ ఎంపీపీ కుమారి బాబు, మాజీ సర్పంచ్ శైలజ నాగయ్య, ఎర్రబోయిన శ్రీరాములు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.