ఎస్ ఎన్ డిపి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
పీర్జాదిగూడ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి..
మేడిపల్లి (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ సర్కిల్లో కొనసాగుతున్న స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పనులను పీర్జాదిగూడ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన హెచ్ఎం డబ్ల్యూ ఎస్ అధికారులతో పాటు, ఎస్ ఎన్ డి పి కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లకు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి పైప్లైన్ల పనుల్లో ఎలాంటి లీకేజీలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని పనులు పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టి, నిర్ణీత కాలవ్యవధిలో అన్ని పనులు పూర్తిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి ఆలయ డైరెక్టర్ వంగూరి పరమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.




