11-06-2025 04:26:04 PM
పార్టీలో నిబద్ధతతో పని చేశా..
పీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని గత 25 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా, ఏ పని అప్పజెప్పినా నిబద్దతో పనిచేశానని పీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య(PCC Vice President Kondeti Mallaiah) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేద, మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు.
ప్రతిపక్షంలో ఉండి పేదల సమస్యల పరిష్కారానికి ఎన్నో పొరాటాలు చేశామని ప్రభుత్వంలో లబ్ధిచేకూరని ఎన్నో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, తెలంగాణ ప్రజా ప్రభుత్వంలోనూ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ప్రకారం పెద్దపీట వేస్తూ ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు, మంత్రి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించిందన్నారు. తాజాగా జరిగిన పీసీసీ కార్యకవర్గంలోనూ సామాజిక న్యాయమే ఎజెండాగా పార్టీ కోసం కష్టప నాయకులకు చోటు కల్పించడం హర్షిస్తున్నానని అన్నారు.
నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఓసీలకు పార్టీ రాష్ట్ర పదవుల్లో చోటు కల్పించడం ఇందుకు గర్వకారణమైన విషయం అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు విషయంలోనూ నల్లగొండ జిల్లాకే మూడు పదవులు ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులనే ఎమ్మెల్సీలుగా ఎన్నుకున్నారని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని పీసీపీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ ముకేష్ కుమార్ గౌడ్, ప్రియతమ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత పెద్దలు జానారెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.