23-06-2025 05:16:51 PM
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజలుగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 ఎన్నికల వేళ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సెట్ అధికారులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం అందడంతోనే భవ్య ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం. 2018 శాసనసభ ఎన్నికల్లో భవ్య ఆనంద్ ప్రసాద్ శేరిలింగంపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. ఆయనకు చెందిన రూ.70 లక్షలను ప్యారడైజ్ వద్ద టాస్క్ పోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం దుబ్బాక ఉపఎన్నికల సమయంలోనే జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
రఘునందన్ రావు బంధువులకు చెందిన రూ.కోటి ని బేగంపేట పరిధిలో రాధాకిషన్ రావు, బృందం సీజ్ చేసినట్లు సిట్ వెల్లడించింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ప్రభాకర్ రావు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ పోర్స్ టీమ్ ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ద్వారా గాంధీనగర్ పీఎస్ పరిధిలో రెక్కీ నిర్వహించారు. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 600 మందికిపైగా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను గత కొన్ని రోజులుగా విచారిస్తూ.. బాధితుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.