పశువుల్లో పునరుత్పత్తి సమస్య పరిష్కారానికి ప్రత్యేక శిబిరాలు
పశు వైద్య విద్యార్థులు సేవా భావాన్ని కలిగి ఉండాలి
పాడి పరిశ్రమను పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్...
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లాలో పశువుల్లో పునరుత్పత్తి సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించి పశు వైద్య విద్యార్థులు ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేసి పాడి పరిశ్రమ పెరుగుదలకు ఎంతగానో దోహదపట్టారని పశువైద్య విద్యార్థుల్లో సేవా భావాన్ని ఎప్పటికీ ఇలాగే కొనసాగించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని బ్రమరాంబిక మల్లికార్జున కళాశాలలో ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వ విద్యాలయ ఆఖరి సంవత్సరం విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంప్ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీవి ఎస్సీ& ఏహెచ్ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులంతా పశువుల్లో పునరుత్పత్తి సమస్యను పరిష్కరించేందుకు కల్వకుర్తి ప్రాంతంలోని సుమారు 28 గ్రామాలలో 8 వేలకు పైగా పశువులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించడం గొప్ప విషయమన్నారు.
పాడి పరిశ్రమతో రైతులకు కలిగే లాభనష్టాల గురించి రైతులకు వివరించాలని పాడి పరిశ్రమను పెంచేందుకు జిల్లా అధికారులు సైతం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పశువుల్లో నెలకొన్న పునరుత్పత్తి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి పాడి పరిశ్రమ పెంపుకు పశు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. అంతకుముందు పశు వైద్య కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించుకోవడానికి ఎన్ఎస్ఎస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ డీస్ఏ డాక్టర్ సతీష్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి రమేష్, విజయ డైరీ డిడి.ధనరాజ్, ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఇంచార్జ్ వెంకటరమణ, కెసిఎస్ రెడ్డి, లక్ష్మి, విజయ్, గోపాల్ తదితరులున్నారు.




