27 February, 2026 | 5:33 PM

గ్రామీణ తాగునీటిపై ప్రత్యేక డ్రైవ్

25-02-2026 12:00 AM

వేసవిలో సర్పంచ్‌లతో కలిసి పనిచేయండి

మిషన్ భగీరథ సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని స్పష్టం చేశారు.

సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాలవారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి, సరఫరా జరిగిందని వారి సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ల ఫోన్ కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని, సమస్యలు వచ్చి న వెంటనే పరిష్కరించాలని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న మిషన్ భగీరథలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంత్రి సీతక్క మంగళవారం సమీక్ష నిర్వహించారు.

మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ ఉందని, వేసవిలోనూ పెద్ద ఇబ్బందులు ఉండవని వివరించారు. మంత్రి ప్రతి ఎస్‌ఈ పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైప్‌లైన్ వేయడం సవాల్‌గా ఉన్న చోట్ల స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు.

గ్రామాలవారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితు లపై సర్పంచ్‌లతో టెలి కా న్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి సూచించారు. ‘అప్పుడే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు స్పష్టంగా తెలుస్తా యి. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ మహా మేడారం జాతరలో తాగునీటి సమస్యలు రాకుండా సమర్థవంతంగా పనిచేసిన మిషన్ భగీరథ ఇంజినీరింగ్ సిబ్బందిని మంత్రి సీతక్క అభినందించారు. వారికి శాలువాలు కప్పి, మెమోంటోలు అందజేసి సత్కరించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, సీఏఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.