30 April, 2026 | 1:48 AM

తాగునీరు, పారిశుద్ధ్యం, సేవలపై ప్రత్యేక దృష్టి

30-04-2026 12:30 AM

కలెక్టర్ ప్రతీక్ జైన్ 

సంగారెడ్డి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధిత అన్ని శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుండి సబ్ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, హౌసింగ్, విద్యుత్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని రూట్లలో పరిధి ప్రారంభం, ముగింపు బోర్డులను స్పష్టంగా కనిపించేలా 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

డివిజన్ వారీగా తాగునీటి సరఫరా పరిస్థితిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రఘువీర్ను అడిగి తెలుసుకున్న కలెక్టర్, బల్క్ సప్లై, పంపింగ్ సమస్యలు, ఇంట్రా మరియు గ్రిడ్ వివరాలపై సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు 1916 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ పూర్తి చేసి త్వరితగతిన పరిష్కరించాలని, ఫిజికల్ ఫైల్స్ను ప్రాపర్ గా పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సాధారణ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు.

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫ్యామిలీ మెంబర్స్, జనన, మరణ ధృవపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై డివిజన్ వారీగా సమీక్షించి,  లబ్ధిదారులను త్వరగా నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, మిషన్ భగీరథ ఎస్‌ఈ రఘువీర్, హౌసింగ్ పీడీ చలపతిరావు, విద్యుత్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు పాల్గొన్నారు.