28-11-2025 12:00:00 AM
రాచకొండ సీపీ సుధీర్ బాబు
ఎల్బీనగర్, నవంబర్ 27 : మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో రాచకొండ షి టీమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. బాలికలను, మహిళలను వెంబడించి వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు.
పోకిరీలకు కౌన్సిలింగ్..
రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు గురువారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను వేదింపులకు గురిచేస్తున్న 110 (మేజర్స్-74 ,మైనర్స్-36 ) మందిని ఎల్బీనగర్ ఉమెన్ సేఫ్టీ ఆఫీసులో, కౌన్సిలర్స్ తో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల తేదీ 1 నుంచి 15వ తేదీ వరకు 135 ఫిర్యాదులు అందాయి.
ఈ మేరకు 110 మందిపై కేసు నమోదు చేశారు. ఫోన్ల ద్వారా వేదించినవి 34, సోషల్ మీడియా ద్వారా వేదించినవి 48, నేరుగా వేదించినవి 53 ఫిర్యాదులు అందాయని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ టి.ఉషారాణి, ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు ఇన్ స్పెక్టర్లు ఎం.ముని, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్త్స్ర రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.